క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై ప్రతిపక్ష నేత అమర్నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు ఎప్పుడూ విధానపరంగానే ఉండాలని, వ్యక్తిగత దూషణలకు తావుండకూడదని ఆయన స్పష్టం చేశారు.ఇటీవల హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన ‘మేకప్’ కామెంట్లపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందిస్తూ కూటమి నేతలకు పలు కీలక సూచనలు చేశారు.మహిళల కట్టుబొట్టుపై విమర్శలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “మహిళల కట్టుబొట్టు, వారి వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేసే స్థాయికి సదరు నాయకుడి పార్టీ వారు దిగజారిపోయారు” అని మండిపడ్డారు. ఇటువంటి చౌకబారు విమర్శలు కేవలం హోంమంత్రి అనితను మాత్రమే కాకుండా, సమాజంలోని ప్రతి సగటు మహిళను కించపరచడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల ప్రతిపక్షాలు చూపిస్తున్న ఈ వివక్షను, వారి అభ్యంతరకర వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ కూటమి (TDP-JSP-BJP) నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజకీయాల్లో విమర్శలు ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపైనే పరిమితం కావాలి. స్త్రీలపై అవతలి పార్టీల వారు చేస్తున్న వ్యాఖ్యల్లో ఎంతటి అసభ్యత, అభ్యంతరకర విషయాలు ఉన్నాయో ప్రజలకు కూలంకషంగా వివరించాలి. సమాజంలో మహిళా ప్రతినిధులకు ఇచ్చే గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.రాజకీయాల్లో హుందాతనాన్ని కాపాడుతూనే, ఇటువంటి వ్యక్తిగత దాడులను తిప్పికొట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మీ పెట్టుబడులకు మాదే భరోసా.. ఏపీకి తరలిరండి: సింగపూర్ సదస్సులో సీఎం చంద్రబాబు పిలుపు!