క్రైమ్ మిర్రర్ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు శివమొగ్గ జిల్లాలో విషాదాన్ని మిగిల్చాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన కొండచరియల విరిగిపడిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారి ఉండటం స్థానికులను కలచివేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొప్పల్ జిల్లా గంగావతి తాలూకా కొక్కరెగర గ్రామానికి చెందిన మల్లికార్జున్ (35), ఆయన భార్య నాగవేణి (28), కుమారుడు సంతోష్ (3) శివమొగ్గ జిల్లా ఇందిరానగర్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో భారీ వర్షాల ప్రభావంతో సమీపంలోని కొండచరియలు విరిగిపడి, వారు నివసిస్తున్న రేకుల షెడ్డుపై పడ్డాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురూ శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో సమీపంలోని మరో షెడ్డుపై కూడా మట్టి, రాళ్లు పడటంతో అందులో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవల బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read : గాదె సాయికృష్ణ కేసు.. A4 నిందితుడి కోసం సిట్ గాలింపు
