బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపురంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ లాడ్జిలో 23 ఏళ్ల మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె భర్తే హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐడెంటిటీ కార్డు ట్యాగ్తో గొంతు బిగించి ఆమెను హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. గౌరిబిదనూరు తాలూకా నాగేరెగెరె గ్రామానికి చెందిన విద్య (23) ఈ ఘటనలో మృతి చెందారు. నాలుగేళ్ల క్రితం విద్య, ఆనంద్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరు దొడ్డబళ్లాపురంలోని గాంధీనగర్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
అయితే గత ఆరు నెలలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలు, మనస్పర్థల నేపథ్యంలో విద్య రెండు నెలల క్రితం భర్తకు దూరంగా వెళ్లి బెంగళూరులోని పేయింగ్ గెస్ట్ వసతిలో ఉంటోంది.
తన భార్య కనిపించడం లేదంటూ ఆనంద్ దొడ్డబళ్లాపురం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సుమారు 20 రోజుల క్రితం పోలీసులు విద్య ఆచూకీని గుర్తించారు. అనంతరం భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి విద్యను తిరిగి ఆనంద్తో పంపించారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఆనంద్ విద్యను దొడ్డబళ్లాపురంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే ఆమెను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం విద్య మొబైల్ ఫోన్ను తీసుకుని ఆనంద్ పరారైనట్లు సమాచారం.
ఘటనపై దొడ్డబళ్లాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆనంద్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడు పట్టుబడిన తర్వాతే హత్యకు దారితీసిన అసలు కారణాలు స్పష్టమవుతాయని పోలీసులు తెలిపారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read: చిరంజీవి ‘కాకా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతికి మెగా మాస్ ట్రీట్!
