క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలోని కొన్ని ప్రభుత్వ గిరిజన బాలికల హాస్టళ్లలో విద్యార్థినులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో బాలికలకు కల్పిస్తున్న మౌలిక వసతులపైనా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇటీవల నాగ్పూర్లోని ఓ గిరిజన బాలికల హాస్టల్ను సందర్శించిన దీప్కేకు అక్కడి విద్యార్థినులు తమ సమస్యలను వివరించారు. సెలవుల అనంతరం ఇంటి నుంచి హాస్టల్కు తిరిగి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారని కొందరు బాలికలు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
ఓ విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం, హాస్టల్కు తిరిగి వచ్చిన వెంటనే తనను ప్రెగ్నెన్సీ పరీక్ష కోసం ఆస్పత్రికి పంపించారట. తన సోదరుడితో కలిసి ఆస్పత్రికి వెళ్లిన సమయంలో అక్కడ ఎక్కువగా వివాహిత మహిళలు ఉండటంతో తాను ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆమె చెప్పినట్లు దీప్కే తెలిపారు. మరో విద్యార్థిని కూడా హాస్టల్లో చేరిన సమయంలో ఇదే విధమైన పరీక్షకు పంపించారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
సెలవుల నుంచి తిరిగి వచ్చే ప్రతి విద్యార్థినికి ఈ పరీక్ష నిర్వహించడం తప్పనిసరిగా ఉందని కొందరు బాలికలు చెప్పినట్లు దీప్కే తెలిపారు. విద్యార్థినులపై ఇలాంటి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల కుటుంబాలకు చెందిన బాలికలకు కూడా ఇదే విధానం అమలు చేస్తారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇదే సమయంలో హాస్టళ్లలోని వసతుల దుస్థితిపైనా ఆయన దృష్టి సారించారు. సుమారు 150 మంది విద్యార్థినులు ఉండే హాస్టళ్లలో రెండు, మూడు వాష్రూమ్లు మాత్రమే ఉండటం, అందరికీ సరిపడా పడకలు లేకపోవడం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. విద్యార్థినులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు కల్పించకుండా ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఎలా ఉంచుతారని ప్రశ్నించారు.
also read : ఉదంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
