బంగారు ఆభరణాల కొనుగోలుదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. బంగారు నగల హాల్మార్కింగ్ ఛార్జీలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) పెంచింది. సెప్టెంబర్ 14 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటివరకు ఒక్కో బంగారు ఆభరణానికి హాల్మార్కింగ్ కోసం రూ.45గా ఉన్న ఛార్జీని రూ.75కు పెంచారు. అంటే ఒక్కో నగపై రూ.30 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే హాల్మార్కింగ్ రుసుము సుమారు 67 శాతం పెరిగింది.
ఈ పెంపు వల్ల ఆభరణాల తయారీదారులు, వ్యాపారులపై అదనపు వ్యయం పడనుంది. ఈ ఖర్చును వ్యాపారులు వినియోగదారుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే బంగారు ఆభరణాల కొనుగోలు ధరపై పరోక్షంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
అయితే వెండి ఆభరణాల హాల్మార్కింగ్ ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. ఇదిలా ఉండగా, హాల్మార్కింగ్ ఫీజు పెంపుపై జెమ్స్ అండ్ జువెలరీ కౌన్సిల్ (GJC) స్పందించింది. పరిశ్రమ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఛార్జీల పెంపును పునఃసమీక్షించాలని కోరింది.
బంగారం ధరలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్న సమయంలో హాల్మార్కింగ్ ఛార్జీల పెంపు అమలులోకి రావడంతో, రానున్న రోజుల్లో ఆభరణాల ధరలపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
also read: చిత్తూరు జిల్లాలో విషాదం.. గణేష్ నిమజ్జన ఊరేగింపులో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి
