శ్రీకాకుళం జిల్లా బూర్జ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఎస్సై ప్రవల్లిక ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సమయంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్సైతో కొందరు వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి ఆమదాలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్తో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన తర్వాత చింతాడ రవి అందుబాటులో లేకుండా పోవడంతో తాజాగా వీడియో సందేశం ద్వారా స్పందించారు.
తాను ఎస్సై ప్రవల్లికపై ఎలాంటి దాడికి పాల్పడలేదని చింతాడ రవి స్పష్టం చేశారు. జనసందోహం ఎక్కువగా ఉండటంతో, ఎస్సై అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో ఆమెను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం మాత్రమే చేశామని తెలిపారు. అయితే తమపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చింతాడ రవికుమార్తో పాటు మొత్తం 21 మందిపై కేసులు నమోదైనట్లు సమాచారం. ఇందులో కొందరిపై గతంలోనూ వివిధ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై ప్రభుత్వ విప్ కూన రవికుమార్ స్పందిస్తూ కీలక ఆరోపణలు చేశారు. కేసు వివరాలు అధికారికంగా బయటకు రాకముందే చింతాడ రవికి సమాచారం ఎలా అందిందని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థలో కొందరు వైసీపీ అనుకూల వ్యక్తులు ఉన్నారంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా, ఘటనలో బాధితురాలైన ఎస్సై ప్రవల్లికను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. పోలీస్స్టేషన్కు వెళ్లి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న మహిళా అధికారిపై జరిగిన ఘటనను ఖండిస్తూ, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, చింతాడ రవి వీడియో ప్రకటనతో రాజకీయ వర్గాల్లో చర్చ మరింత వేడెక్కింది.
also read: ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. 59కి చేరిన బాధితుల సంఖ్య
