క్రైమ్ మిర్రర్ : షేర్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో ఏర్పడిన ఆర్థిక వివాదం ఓ వ్యక్తి హత్యకు దారితీసింది. డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా కనిపించకుండా పోయిన వ్యక్తిపై కోపంతో అతడి తండ్రిని లక్ష్యంగా చేసుకుని కత్తితో దాడి చేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ముషీరాబాద్ భోలక్పూర్కు చెందిన మహ్మద్ నిజాముద్దీన్ (36)కు చిలకలగూడ నామాలగుండు ప్రాంతానికి చెందిన సుమన్తో పరిచయం ఉంది. ఈ పరిచయం కారణంగా షేర్ మార్కెట్ ట్రేడింగ్, పెట్టుబడుల కోసం సుమన్కు సుమారు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిజాముద్దీన్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఇచ్చిన నగదు తిరిగి అందకపోవడంతో పాటు సుమన్ కొంతకాలంగా అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో ఆగ్రహానికి గురైన నిజాముద్దీన్.. సుమన్ ఇంటికి వెళ్లి అతడి తండ్రి శ్రీనివాస్ (56)ను లక్ష్యంగా చేసుకున్నాడు. మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో మైలార్గడ్డలోని ఎవర్గ్రీన్ టెంట్ హౌస్ సమీపంలో శ్రీనివాస్ ఉండగా అక్కడికి చేరుకున్న నిజాముద్దీన్ కత్తితో ఆయనపై దాడి చేశాడు. పొట్ట భాగంలో రెండుసార్లు కత్తితో పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు.
తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే కుప్పకూలడంతో స్థానికులు వెంటనే టీజీఎస్ఆర్టీసీ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ రాత్రి 9.05 గంటల సమయంలో మృతి చెందారు. సీఎంఓ డాక్టర్ వెంకటస్వామి ఆయన మృతిని ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు మహ్మద్ నిజాముద్దీన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
also read : పనీర్ పేరుతో విషం.. కోనసీమలో కల్తీ దందా
