-
నెల్లూరు సిటీ బాధ్యతలు ఇచ్చేందుకు జగన్ ససేమిరా..
-
ఇప్పటికే అక్కడ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..
-
వైసీపీలో పోటీ చేసేందుకు మాజీ మంత్రికి అవకాశం లేనట్టే..
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఫైర్ బ్రాండ్లు ఉండేవారు. అయితే వారు రాజకీయ వ్యక్తిగత విమర్శలకే పరిమితం అయ్యేవారు.. వారితో పార్టీకి లాభం కంటే నష్టం అధికమన్న అభిప్రాయం ఉంది. అటువంటి వారి విషయంలో జగన్ పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జగన్ ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. అందుకే ఆయనకు పార్టీలో ఏ బాధ్యతలు అప్పగించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కోరుకుంటున్నారు అనిల్ కుమార్ యాదవ్. కానీ అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు జగన్.
-
స్థానిక ఎన్నికల నేపథ్యంలో..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను వేదికగా చేసుకుని.. నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు ఆశిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి సానుకూలత రాలేదు.
అందుకే ఇప్పుడు అధినేత జగన్ దృష్టిని ఆకర్షించేందుకు.. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి దంపతులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. కేవలం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు.. మళ్లీ నెల్లూరు జిల్లాలో పట్టు పెంచుకునేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది.
-
జగన్ కు సన్నిహితుడు…
ప్రస్తుతం నెల్లూరు సిటీ వైసీపీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయుడు. ఆర్థికంగా, సామాజిక వర్గపరంగా బలమైన నేత. ఆయనను పక్కన పెట్టి మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ కు బాధ్యతలు అప్పగించే ఛాన్సే లేదన్నది వైసీపీ వర్గాల మాట. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు వస్తున్నారు. కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరు కావడం లేదు.
-
శత్రు వర్గం అధికం..
ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు జిల్లాలో శత్రువర్గం అధికం. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తూ.. రెడ్డి సామాజిక వర్గం నేతల విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనిల్ కుమార్ యాదవ్.
బీసీ కార్డును వాడుకొని రాజకీయంగా ఉన్నత పదవులు పొందారు అనిల్ కుమార్ యాదవ్. మరోసారి ఆయనకు చాన్స్ ఇస్తే తమ అవకాశాలకు గండి పడతాయి అన్న ఆందోళన రెడ్డి సామాజిక వర్గం నేతల్లో ఉంది. అందుకే ఆ సామాజిక వర్గం నేతలంతా జగన్మోహన్ రెడ్డి పై. మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
