-
పోలైన ఓట్లు కంటే తొలగింపు ఓట్లు అధికం
-
యాకత్ పురా నియోజకవర్గంలో విచిత్రం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సర్ ప్రక్రియ ప్రకంపనలు రేపుతోంది. పాతబస్తీలోని కీలకమైన యాకత్ పురా శాసనసభ నియోజకవర్గ పరిధిలో సర్ సంచలనంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఏకంగా 1,54,982 ఓట్లను తొలగించేందుకు సిద్ధమవుతున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లు 1,40, 434 ఓట్లు కాగా.. తీసివేతకు సిద్ధం చేసిన ఓట్ల సంఖ్య దాదాపు 14,500 కంటే ఎక్కువ. ఈ అంశం ఇప్పుడు స్థానిక, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
-
హిందూ పేర్లే అధికం..
పాత బస్తీలో కీలక నియోజకవర్గం ఇది. అయితే ఓట్ల తొలగింపు పేర్లలో సగం వరకు హిందూ పేర్లే ఉన్నాయి. ప్రధానంగా ఇతర ప్రాంతాలకు మారిపోయారనే నెపంతో 1,03,548 ఓట్లను, ఆబ్సెంట్ కింద 25,008 ఓట్లను, మరణించారని 14,566 ఓట్లను చేర్చారు.
అంతేకాకుండా నకిలీ, డూప్లికేట్ ఓట్ల కేటగిరీలో నమోదైన 11860 ఓట్లు ఉన్నాయి. బూత్ లెవెల్ అధికారులకు సరైన డోర్ నెంబర్లు, పక్కా చిరునామాలు లేకుండా ఏ ఎస్ డి జాబితాలు ఇవ్వడం వల్ల క్షేత్రస్థాయి పరిశీలన అస్తవ్యస్తంగా మారింది.
-
భిన్నాభిప్రాయాలు..
అయితే ఈ సర్ ప్రక్రియను తప్పుపడుతున్నారు పాతబస్తీ నేతలు. కేవలం సగం చిరునామాలతో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండే పాతబస్తీ వీధుల్లో.. ఓటర్లను ఏ విధంగా ధ్రువీకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల జాబితాలోని ఇలాంటి లోపాల వల్లే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతుందని అభిప్రాయం కూడా ఉంది.
ఇక్కడ 40 శాతానికి మించి ఓటింగ్ నమోదు కాదు. ఓటర్లు ఇక్కడే ఉంటే ఎందుకు ఓటు వేయరు అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది. పక్కాగా వెరిఫికేషన్ జరుగుతోందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకత్ పుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థి గెలిచారు.
ఎంబీటీకి చెందిన అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు లక్షన్నరకు పైగా ఓట్లను తొలగించడం లేదా మార్పులు చేయడం అనేది.. రాబోయే ఎన్నికల ఫలితాలను పూర్తిగా తలకిందులు చేసే అవకాశం ఉంది.
