క్రైమ్ మిర్రర్ : న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనం లోపల పలువురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. దీంతో శిథిలాల కింద కొంతమంది చిక్కుకుని ఉండొచ్చనే అనుమానంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భవనం కూలిన వెంటనే స్థానికులు, రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగించే పనులు ప్రారంభించారు.
ఇప్పటివరకు ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసినట్లు సమాచారం. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థుల్లో చాలామంది హాస్టల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో సుమారు 50 మంది వరకు ఉండొచ్చని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపినట్లు సమాచారం.
కాంక్రీట్ స్లాబ్ కింద ఓ వ్యక్తి చిక్కుకున్నట్లు గుర్తించిన రెస్క్యూ సిబ్బంది.. అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయక చర్యలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. శిథిలాల తొలగింపు, గల్లంతైన వారి వివరాల సేకరణతో పాటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
also read : విజయవాడ ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం..
