క్రైమ్ మిర్రర్ : ఇరాన్లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుర్దెస్థాన్ ప్రావిన్స్లోని సనందజ్–హమెదాన్ రహదారిపై ఓ ఇంధన ట్యాంకర్ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అనంతరం ట్యాంకర్లో మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు సమీపంలోని ఇతర వాహనాలకు కూడా వ్యాపించినట్లు సమాచారం. దీంతో అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంకర్ అదుపుతప్పడానికి కారణమేంటి? డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక మరేదైనా సాంకేతిక కారణమా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో ఇరాన్లో గతంలో జరిగిన మరో ఘోర ప్రమాదం కూడా చర్చకు వచ్చింది. 2018లో ఇదే తరహాలో ఇంధన ట్యాంకర్ ప్రయాణికుల బస్సును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. తాజా ఘటనతో ఆ నాటి విషాద ఘటనను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.
also read :పట్టాలు తప్పిన మహానంద ఎక్స్ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం
