మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదాంతంగా మారింది. ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడిన విభేదాలు చివరకు హత్యకు దారితీశాయి.
దుఆరి గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇస్రార్ (30), అతడి స్నేహితుడు ఆశిష్ కోల్ ఒక యువతిని ప్రేమించినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఇస్రార్కు ఆశిష్ మద్యం తాగించాడు. అనంతరం పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఆగస్టు 28న కాలువలో ఇస్రార్ మృతదేహం లభించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఇస్రార్ మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా.. ఆశిష్తో అతడికి ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆశిష్ను అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read: నానక్రామ్గూడ హిట్ అండ్ రన్.. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి లైసెన్స్ రద్దు
