క్రైమ్ మిర్రర్ : అప్పుల బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జి వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. తణుకుకు చెందిన నంబూరు శ్రీనివాస్, పద్మిని దంపతులు గత కొంతకాలంగా స్థానికంగా కిరాణా దుకాణం, పాల వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 16 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. సుమారు 20 ఏళ్లుగా తణుకులో నివాసం ఉంటున్న ఈ కుటుంబం.. వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో అప్పుల భారం పెరిగినట్లు సమాచారం.
ఈ క్రమంలో శనివారం కుటుంబంలోని నలుగురూ చించినాడ బ్రిడ్జి వద్ద గోదావరి నదిలోకి దూకినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను గమనించిన స్థానిక మత్స్యకారులు పద్మినిని రక్షించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే శ్రీనివాస్, వారి ఇద్దరు పిల్లలు గోదావరిలో గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read : వణికిస్తున్న నకిలీ హిజ్రాలు!
