హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: హైదరాబాద్లోని మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు హత్యకు గురికావడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. తాజాగా అలీనగర్లో ఓ ఆటో డ్రైవర్ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. జహంగీరాబాద్కు చెందిన అబ్దుల్ రవూఫ్ (28) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో అలీనగర్లోని డెక్కన్ ప్యాలెస్ సమీపంలో అతడిపై ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కత్తులతో దాడి చేయడంతో రవూఫ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. రవూఫ్ను ఎవరు, ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
24 గంటల వ్యవధిలో రెండో హత్య…
Also Read:రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్లపై స్పష్టతనిచ్చిన బీసీసీఐ
ఈ ఘటనకు కొన్ని గంటల ముందు ఇదే మైలార్దేవ్పల్లి పరిధిలో ఖాజా సోహెల్ అనే రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. పల్లెచెరువు ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులతో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో డబ్బులు, వ్యక్తిగత విషయాలపై వివాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అనంతరం ఇద్దరు వ్యక్తులు కత్తులతో సోహెల్పై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.తాజాగా ఆటో డ్రైవర్ రవూఫ్ హత్య కూడా జరగడంతో ఈ రెండు హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు రెండు ఘటనల మధ్య సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కాలేదు.
