క్రైమ్ మిర్రర్ : బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలో పిల్లల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడు కత్తిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరాఖండ్లోని ఉధమ్సింగ్ నగర్ జిల్లా జస్పూర్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చిపియన్ ప్రాంతానికి చెందిన కొందరు బాలురు షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఆటలో భాగంగా షటిల్కాక్ సమీపంలోని కాలువలో పడిపోయింది. దానిని ఎవరు బయటకు తీసుకురావాలన్న విషయంలో పిల్లల మధ్య మాటామాటా పెరిగింది.
ఈ క్రమంలో 9, 11 ఏళ్ల బాలుర మధ్య వాగ్వాదం జరిగింది. మొదట ఒకరిపై ఒకరు షటిల్కాక్తో దాడి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం 9 ఏళ్ల బాలుడు బ్యాడ్మింటన్ రాకెట్తో 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసినట్లు సమాచారం. దీంతో ఆగ్రహానికి గురైన 11 ఏళ్ల బాలుడు తన వద్ద ఉన్న కత్తితో 9 ఏళ్ల బాలుడి ఛాతిపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన బాలుడు సహాయం కోసం సమీపంలోని మెడికల్ షాపు వైపు వెళ్లాడు. అక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 11 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఘటనా సమయంలో అక్కడ ఉన్న ఇతర బాలురు, స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలను నిర్ధారించేందుకు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
also read : స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృత్యువాత..
