ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో పడి ఓ యువకుడు మృతిచెందిన విషాద ఘటన బాసరలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం కౌల్పూర్ గ్రామానికి చెందిన రామావత్ సాయికిరణ్ (25) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
సాయికిరణ్ కొంతకాలంగా యూకేలో ఉంటున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ఆయన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నాడు. అనంతరం గోదావరి వంతెనపై ఫొటోలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ అదుపుతప్పి నదిలో పడిపోయాడు.
సమాచారం అందుకున్న అధికారులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం సాయికిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కాగా.. సాయికిరణ్ ఈ నెల 5న తిరిగి యూకే వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరగడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: కవల ఆడపిల్లలపై కన్నతల్లి దారుణం.. బకెట్లో ముంచి హత్య
