క్రైం మిర్రర్ : జమ్మూకశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ఆకస్మిక వరదల కారణంగా సుమారు 10 మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. రాజౌరి జిల్లాలో నదులు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. స్థానిక బస్టాండ్ పూర్తిగా జలమయమవగా, పలువాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దార్హాలి, ఖాండ్లీ, సుక్తోహ్, జమోలా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరద ఉద్ధృతికి దార్హాలి నదిపై ఉన్న రక్షణ గోడ (సేఫ్టీ వాల్) దెబ్బతింది.
అబ్దుల్లా బ్రిడ్జి సమీపంలోని 50కిపైగా కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే వరదల్లో చిక్కుకున్న 14 మందిని సహాయక బృందాలు క్షేమంగా రక్షించాయి. పూంచ్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా, జూలై 23 వరకు జమ్మూకశ్మీర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.