-
ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు
-
వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
-
మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం
ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఈ అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మరో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
హైదరాబాద్ తో సహా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతం నుంచి మరాట్వాడా వరకు ద్రోణి ఒకటి సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో తెలగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం కొనసాగుతోంది. మరో రెండు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఈదుగు గాలులకు పలు జిల్లాల్లో పంటల నష్టం
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షానికి యాసంగి పంటలు గోధుమ, మొక్కజొన్న పంట లు నేలకొరిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాల కారణంగా మర్చి రైతులకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దుబ్బాక పట్టణంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లోని చెట్లు నేలకొరిగాయి. జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగళ్ల వాన కురిసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోనూ అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. కాగా, ఈ రోజు ఆదిలా బాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
