ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు రూ.5 వేల నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రచారం వైరల్ అవుతోంది. ఈ నగదు పొందేందుకు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలని కొన్ని పోస్టుల్లో పేర్కొంటున్నారు.
అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రూ.5 వేల నగదు ప్రోత్సాహకం ప్రకటించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది.
బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారం ఇవ్వాలంటూ వచ్చే ఇలాంటి సందేశాలు, లింకులు, ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ పథకాలు, ప్రధానమంత్రి పేరుతో వచ్చే ఏదైనా ఆర్థిక ప్రయోజనానికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక ప్రభుత్వ వేదికల్లో మాత్రమే ధృవీకరించుకోవాలని కోరింది.
కాబట్టి ఆగస్టు 15 సందర్భంగా రూ.5 వేల నగదు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అధికారులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు.
గమనిక: ప్రధాని మోదీ పేరుతో నగదు ప్రోత్సాహకం అందిస్తామంటూ వచ్చే అనుమానాస్పద ప్రకటనలను ముందుగా అధికారిక ప్రభుత్వ వనరుల ద్వారా నిర్ధారించుకోవడం మంచిది.
also read: పట్టపగలే మహిళ మెడలో గొలుసు చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు
