-
ఆగ్రహంగా హై కమాండ్
-
తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రత్యేక ఫోకస్
-
నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరే అవకాశం
హైదరాబాద్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై వేటు పడుతుందా? కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉందా? ఆయనకు నోటీసులు జారీ కానున్నాయా? సరైన సంజాయిషీ ఇవ్వకపోతే ఆయనపై చర్యలు తీసుకుంటారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లడమే కాదు.. టిపిసిసి సైతం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించడంతో.. అది రాజగోపాల్ రెడ్డి కేనని ప్రచారం నడుస్తోంది.
-
మంత్రి పదవి రాకపోవడంతో..
గత కొంతకాలంగా మంత్రి పదవి ఆశిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. కానీ అది అందని ద్రాక్ష గానే ఉంది. జాప్యం జరుగుతున్న కొద్ది అసహనంతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇటీవల అయితే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వారు తెలంగాణను ఏలుతున్నారు.. తెలంగాణలో కీలక పదవుల్లో ఉన్నారు.. లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగింది. పార్టీ హైకమాండ్ కు సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. అయితే మంత్రి పదవి హామీతో పార్టీలో చేరిన రాజగోపాల్ రెడ్డికి ఆ పదవి అందకుండా చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక వాదన. అయితే ఆయన తీవ్ర అసహనంతో రగిలిపోతున్న తీరును కాంగ్రెస్ హై కమాండ్ తప్పుపడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణ కట్టు దాటుతున్నారని రాజగోపాల్ రెడ్డి పై మిగతా కాంగ్రెస్ నాయకులు ఆగ్రహంగా ఉన్నారు.
మిగతా నేతల అభ్యంతరాలు..
పదేపదే కాంగ్రెస్ పార్టీలో తామే సీనియర్లను అని వాదిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారంతా బయట పార్టీల నుంచి వచ్చిన వారే అంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. అయితే ఆయన బిజెపిలో చేరి మొన్నటి ఎన్నికలకు ముందు మంత్రి పదవి హామీతో కాంగ్రెస్ లోకి వచ్చారు. అటువంటి నేత ఇప్పుడు గట్టిగా మాట్లాడడం ఏమిటనేది మిగతా నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రిగా ఉన్నారు. అటువంటిప్పుడు అదే ఇంట్లో మరో పదవి కామెంట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎలా ఇస్తారు అని కాంగ్రెస్ లో మెజారిటీ వర్గం ప్రశ్నిస్తోంది. కానీ అదే పనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకే పార్టీ హై కమాండ్ ఆయన విషయంలో ఆలోచన చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు టీపీసీసీ ప్రెసిడెంట్ గీత దాటితే వేటు తప్పదన్న హెచ్చరిక వెనుక రాజగోపాల్ రెడ్డికి వార్నింగ్ అని ఒక ప్రచారం ఉంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
