క్రైమ్ మిర్రర్ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతైన ఘటన విజయవాడలో విషాదాన్ని నింపింది. కృష్ణలంకకు చెందిన గౌతమ్, జాషువా, తేజ ముగ్గురూ నదిలో ఈతకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ గల్లంతైనట్లు తెలుస్తోంది. యువకులు నదిలోకి వెళ్లి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించి కృష్ణా నదిలో విస్తృతంగా గాలిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహం, లోతు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు నదిలో వివిధ ప్రాంతాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకులు సురక్షితంగా బయటపడాలని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆశిస్తున్నారు.
also read : పవన్ కళ్యాణ్ కు తీవ్ర అస్వస్థత…!
