కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ యువకుడిని ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్కు చెందిన ఈ యువకుడు విదేశాల్లో ఉన్న ఉగ్రవాద హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
అధికారుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. అఫ్గానిస్తాన్కు చెందిన టీటీపీ (తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్) ఉగ్రవాద సంస్థకు సంబంధించిన హ్యాండ్లర్లతో నిందితుడు సంబంధాలు కొనసాగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్లో దాడులకు సంబంధించిన ప్రణాళికలపై అతడు చర్చలు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అరెస్టు అనంతరం నిందితుడి ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికి ఉగ్రవాద నెట్వర్క్తో ఉన్న సంబంధాలు, ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు, దాడుల ప్రణాళికలో అతడి పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులో మరికొందరికి సంబంధం ఉందా? నిందితుడికి విదేశీ ఉగ్రవాద సంస్థల నుంచి ఏమైనా ఆదేశాలు లేదా ఆర్థిక సహకారం అందిందా? అనే కోణాల్లోనూ అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం నిందితుడిపై వచ్చిన ఆరోపణలను అధికారులు వివిధ ఆధారాలతో ధ్రువీకరించే పనిలో ఉన్నారు.
also read: కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతు
