మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ఓ మహిళ చేసిన దారుణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కన్నబిడ్డను కాపాడాల్సిన తల్లే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో కేవలం 2 ఏళ్ల చిన్నారిని కిరాతకంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన దాదాపు 20 రోజుల తర్వాత అసలు నిజాలు బయటపడటంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషాదకర ఘటన మేడ్చల్ జిల్లా కీసర పరిధిలో చోటుచేసుకోగా, పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగుల్ గ్రామానికి చెందిన స్వామి, జ్యోతి దంపతులు ప్రస్తుతం మేడ్చల్ జిల్లా కీసరలో నివాసం ఉంటున్నారు. కుటుంబ పోషణ కోసం స్వామి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండగా, వీరికి 4 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హరికృష్ణ ఉన్నారు. అయితే జ్యోతికి వివాహానికి ముందే యాదాద్రి భువనగిరి జిల్లా మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్తో పరిచయం ఉండేదని, పెళ్లి అనంతరం కూడా ఆ పరిచయం వివాహేతర సంబంధంగా కొనసాగిందని పోలీసులు గుర్తించారు. భర్త విధులకు వెళ్లిన సమయంలో నవీన్ తరచూ ఇంటికి వచ్చి వెళ్లేవాడని విచారణలో తేలింది.
గత నెల 29న స్వామి ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లిన తర్వాత నవీన్ జ్యోతి ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఏకాంతంగా ఉండగా 2 ఏళ్ల హరికృష్ణ ఏడవడం ప్రారంభించాడు. చిన్నారి ఏడుపుతో అసహనానికి గురైన నవీన్, బిడ్డ తమకు అడ్డుగా మారుతున్నాడని చెప్పగా, జ్యోతి కూడా అతని మాటకు అంగీకరించినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం ఇద్దరూ కలిసి చిన్నారి కాళ్లు పట్టుకుని గాల్లోకి ఎత్తి నేలకేసి బలంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఈ దారుణానికి పాల్పడిన అనంతరం జ్యోతి ఎంతో చాకచక్యంగా వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన కుమారుడు ఫిట్స్ రావడంతో అకస్మాత్తుగా మృతి చెందాడని భర్త స్వామిని నమ్మించింది. ఆ తర్వాత చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామమైన తీగుల్కు తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి అంత్యక్రియలు కూడా నిర్వహించింది. దీంతో చిన్నారి మరణంపై ఎలాంటి అనుమానాలు రాకుండా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
అయితే కొంతకాలంగా భార్య ప్రవర్తనలో మార్పులు గమనించిన స్వామికి అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో బంధువుల సమక్షంలో జ్యోతిని ప్రశ్నించగా అసలు విషయం బయటపడినట్లు సమాచారం. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన స్వామి వెంటనే కీసర పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి చిన్నారి మృతదేహాన్ని తీగుల్ గ్రామంలో వెలికితీశారు. అనంతరం మేజిస్ట్రేట్ సమక్షంలో రీ-పోస్టుమార్టం నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఘటన అనంతరం పరారీలోకి వెళ్లిన నవీన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దాదాపు 20 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది. అమాయక చిన్నారి ప్రాణాన్ని పొట్టనబెట్టుకున్న నిందితులకు అత్యంత కఠినమైన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: దేవుడిలా వచ్చి ప్రాణాలు కాపాడిన పోలీసులు