ఒంగోలు, క్రైమ్మిర్రర్:ఒంగోలులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న అంధురాలు ఆదిలక్ష్మి పట్టణంలోని డిపో సెంటర్ సమీపంలో ఉన్న శ్రీరామ్ లాడ్జీలో హత్యకు గురైన ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. మృతురాలు ఆదిలక్ష్మి అంధురాలని గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిలక్ష్మి ఒంగోలులోని ఇరిగేషన్ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తోంది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో భర్త మల్లికార్జున్ ఒంగోలు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా ఆదిలక్ష్మి వెంకటరమణ అనే వ్యక్తితో కలిసి డిపో సెంటర్ వద్ద ఉన్న శ్రీరామ్ లాడ్జిలో దిగినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని లాడ్జి గదిని తెరిచి చూడగా ఆదిలక్ష్మి రక్తపు మడుగులో మృతిచెందిన స్థితిలో కనిపించింది. ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎస్పీ.. “భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్యేకంగా మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాం. లాడ్జిలో మహిళ మృతదేహం లభించింది. ఆమెతో కలిసి ఉన్న వెంకటరమణ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి” అని తెలిపారు. పోలీసులు లాడ్జి సిబ్బందిని ప్రశ్నిస్తూ, సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని, అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు