బాలీవుడ్ ప్రముఖ నటి రాణి ముఖర్జీకి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ లా ట్రోబ్ యూనివర్సిటీ ఆమెకు ‘గౌరవ డాక్టరేట్ ఆఫ్ లెటర్స్’ అందించింది. భారతీయ సినీ రంగానికి ఆమె అందించిన విశిష్ట సేవలతో పాటు.. మహిళలు, పిల్లలు, సమాజంలోని అణగారిన వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ వెల్లడించింది.
దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న రాణి ముఖర్జీ.. నటిగా ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. జాతీయ అవార్డుతో పాటు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న ఆమె.. తన నటనతో పాటు సామాజిక అంశాలపై కూడా తన గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు.
మెల్బోర్న్లో జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) వేడుకల్లో భాగంగా ఆగస్టు 14న రాణి ముఖర్జీకి ఈ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రాణి ముఖర్జీ భావోద్వేగానికి గురయ్యారు. తన జీవితంలో సినిమానే తనకు గొప్ప గురువుగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. శక్తివంతమైన కథలు ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా.. సమాజంలో సానుకూల మార్పుకు కారణమవుతాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
తనకు లభించిన ఈ అరుదైన గౌరవాన్ని భారతదేశానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా తనను దశాబ్దాలుగా ఆదరిస్తున్న అభిమానులు, ప్రేక్షకులకు అంకితం చేస్తున్నట్లు రాణి ముఖర్జీ తెలిపారు.
also read: భార్యపై ప్రేమతో మరో తాజ్ మహల్.. మధ్యప్రదేశ్లో వ్యాపారవేత్త అద్భుత కానుక!
