‘జనరేషన్ గట్టర్’ వ్యాఖ్యలపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి స్పందించారు. దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆమె స్పష్టం చేశారు. తన మాటలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను విడుదల చేశారు.
తన వ్యాఖ్యలపై ఓ కాంగ్రెస్ నేత చేసిన విమర్శలకు కంగనా ఘాటుగా సమాధానం ఇచ్చారు. జూలైలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారని, వారిలో సుమారు 2 వేల మంది మాత్రమే జెన్-జీకి చెందినవారని ఆమె పేర్కొన్నారు. మిగిలినవారు వివిధ వయసుల వారేనని చెప్పారు.
ఆ నిరసనలో వయసు పైబడిన పలువురు కూడా పాల్గొన్నారని కంగనా అన్నారు. అలాంటి కార్యక్రమాన్ని మొత్తం జెన్-జీ నిరసనగా ఎలా అభివర్ణిస్తారని ఆమె ప్రశ్నించారు.
దేశంలో జెన్-జీ జనాభా సుమారు 30 నుంచి 35 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్న కంగనా.. కొద్దిమంది పాల్గొన్న నిరసన ఆధారంగా దేశంలోని యువత మొత్తాన్ని విమర్శించడం సరికాదన్నారు. యువత మొత్తాన్ని తాను కించపరిచినట్లు ఆధారాలు చూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు.
“నేను యువతకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే నేను కూడా యువతనే” అని కంగనా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయసుపై కూడా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తన వ్యాఖ్యల ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని, నిర్దిష్టంగా ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను దేశంలోని మొత్తం యువతకు ఆపాదించడం సరికాదని కంగనా మరోసారి స్పష్టం చేశారు.
also read: ప్రకాశ్ రాజ్ వర్సెస్ ఎన్నికల అధికారులు.. ముదిరిన ఓటు వివాదం
