క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులు కిందట వైసీపీ నాయకులు, శ్రేణులను ఉద్ధేశించి పవన్ కల్యాణ్ చేసిన తొక్కి నార తీస్తా అన్న వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అకారణంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, జగన్ను తిడుతుంటారని పేర్కొన్నారు. ఆయన మాటలకు వైసీపీ శ్రేణులు రెస్పాండ్ అయితే.. చూశారా.? తనను తింటారంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాబట్టి, వైసీపీ శ్రేణులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించవద్దని కోరారు. వినోదం చూసినట్టు పవన్ వ్యాఖ్యలు చూడాలని వైసీపీ శ్రేణులకు సూచించారు.
సుగాలి ప్రీతి కోసం పార్టీ పెట్టామని చెప్పారని, కానీ, ఆమె తల్లి రోధన అరణ్య రోధనగానే మిగిలిందన్నారు. పవన్ కల్యాణ్ ఎన్ని తిట్లు తిట్టినా పట్టించుకోవద్దని, స్మూత్గా చెప్పి విడమర్చి చెప్పాలే తప్పా, ఆటలో అరటి పండు అని వదిలేయాలని సూచించారు. హోంశాఖ మీ చేతిలోలేదంటున్నారని, పంచాయతీరాజ్ మీ చేతిలో ఉందని, పంచాయతీ రాజ్శాఖకు ఏమైనా న్యాయం చేశారా.? అని ప్రశ్నించారు. రూరల్ డెవలప్మెంట్, అటవీశాఖకు ఏమైనా న్యాయం చేశారా.? అని ప్రశ్నించారు. ఉన్న శాఖకు న్యాయం చేయరని, కానీ, పక్క శాఖపై మాత్రం దృష్టి అని పేర్కొన్నారు. ఇచ్చిన శాఖను ఉద్ధరించాలని, అది ఉద్ధరించకుండా పక్క శాఖ మీదకు ఎందుకున్నారు. రిజైన్ చేసి హోంశాఖ తీసుకోవాలని సూచించారు.
మీ పార్టీలో, టీడీపీలో ఉన్న రౌడీలు, గూండాలు, దౌర్జన్యం చేసేవారి సంగతి ఎవరు చూస్తారని, వారిని తొక్కి నార ఎవరు తీస్తారని ప్రశ్నించారు. ఎంత సేపు వైసీపీ వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. రెండేళ్లలో పంచాయతీ అకౌంట్లను ఫ్రీజ్ చేశారన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు పెట్టుకునేందుకు లేదని, రోడ్లు వేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని, కేంద్రం నుంచి వచ్చిన నిధులతో రోడ్లు వేస్తున్నారన్నారు. పంచాయతీరాజ్శాఖ మంత్రులుగా ఎంతో మంది ఉన్నప్పుడు కూడా వేశారన్నారు. పనికి రాని ఏనుగులను కర్ణాటక తెచ్చారని, కుంకి ఏనుగులు మరే ఏనుగులను తోలడం లేదన్నారు.