క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్లో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సాగర్ జిల్లాలోని బందా తహసీల్ పరిధిలో ఉన్న నౌరాజ్, గూగ్రా ఖర్ద్ గ్రామాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మద్యం సేవించిన పలువురు.. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మద్యం సేవించిన తర్వాత కొందరికి రాత్రి నుంచి అనారోగ్య లక్షణాలు కనిపించాయి. తలనొప్పి, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ పలువురు మృతి చెందగా, మరికొందరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలియగానే సాగర్ కమిషనర్, ఐజీ, కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు రెండు గ్రామాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితులకు జిల్లా సివిల్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల 48 గంటల్లో మద్యం సేవించిన వారిలో తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఘటన అనంతరం అధికారులు ఆ ప్రాంతంలోని ఆరు మద్యం దుకాణాలను మూసివేసి సీజ్ చేశారు. స్థానికులు ఆయా దుకాణాల నుంచి మద్యం కొనుగోలు చేసి సేవించవద్దని హెచ్చరించారు. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తయారు చేశారు? ఎవరెవరు విక్రయించారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్పందించారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు సంబంధిత మంత్రులు ఘటనాస్థలికి వెళ్లాలని ఆదేశించారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
also read : వంతెనపై అందరూ చూస్తుండగానే.. చీనాబ్ నదిలోకి దూకిన యువతి
