మలేరియా నివారణ చర్యల్లో భాగంగా పంపిణీ చేసిన క్లోరోక్విన్ మాత్రలు వాడిన అనంతరం ఓ బాలిక మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురైన ఘటన పోలవరం జిల్లాలో చోటుచేసుకుంది. ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
అధికారుల వివరాల ప్రకారం.. గ్రామంలో మొత్తం 71 మందికి క్లోరోక్విన్ మాత్రలు పంపిణీ చేశారు. మాత్రలు తీసుకున్న కొద్దిసేపటికే 53 మందిలో అనారోగ్య లక్షణాలు కనిపించాయి. అస్వస్థతకు గురైన వారిలో 46 మంది విద్యార్థులు, ఏడుగురు పెద్దలు ఉన్నారు.
వారిలో రెండో తరగతి చదువుతున్న మడివి జమున (7) వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అస్వస్థతకు గురైన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. క్లోరోక్విన్ మాత్రల వినియోగం, బాధితుల అస్వస్థతకు గల కారణాలపై అధికారులు పరిశీలన చేపట్టారు.
ఈ ఘటనతో గొల్లగుప్ప గ్రామంలో ఆందోళన నెలకొంది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
also read: కర్ణాటకలో ఏపీ యువతి అనుమానాస్పద మృతి.. కట్నం వేధింపులే కారణమా?
