ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీ స్థాయిలో దాడులకు పాల్పడింది. దాదాపు 12 గంటల పాటు బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు భారీ సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. మొత్తం 218 డ్రోన్లతో దాడులు జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో ముగ్గురు చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు గాయపడగా.. పలు ప్రాంతాల్లో భవనాలు, మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో కీవ్పై ఇంత తీవ్రస్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి అని ఉక్రెయిన్ వర్గాలు వెల్లడించాయి.
రష్యా దాడుల్లో పౌర ప్రాంతాలే లక్ష్యంగా మారాయని ఉక్రెయిన్ ఆరోపించింది. ఇదే సమయంలో కీవ్లోని ఓ రైల్వే డిపోపై క్షిపణి పడటంతో ఆరుగురు ఉద్యోగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు భారత పౌరుడు ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు.
భారీ దాడుల నేపథ్యంలో కీవ్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. దాడుల కారణంగా జరిగిన నష్టం, ప్రాణనష్టంపై అధికారులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.
also read: వివాహేతర సంబంధం ఆరోపణలు.. వ్యక్తికి చెప్పుల దండతో ఊరేగింపు
