నారాయణపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడి పెళ్లి వేడుకకు వెళ్లిన 17 ఏళ్ల యువకుడు డీజే సౌండ్కు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.
పోతిరెడ్డిపల్లికి చెందిన దస్తయ్య, లక్ష్మీ దంపతుల కుమారుడు రవితేజ(17) సోమవారం రాత్రి తన స్నేహితుడి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. పెళ్లి వేడుకలో డీజే సంగీతానికి ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తుండగా అకస్మాత్తుగా కిందపడిపోయాడు.
దీంతో ఆందోళనకు గురైన స్నేహితులు, స్థానికులు వెంటనే రవితేజను కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే రవితేజ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
యువకుడి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పెళ్లి వేడుకలో ఆనందంగా కనిపించిన రవితేజ కొద్దిసేపటికే మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read: పెళ్లైన రెండు నెలలకే విషాదం.. వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్య
