Homeతెలంగాణవ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..

వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సాంకేతికత వినియోగాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బోనస్ అందించే ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందించడంతో పాటు రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించారు. సన్న వడ్లు పండించే రైతుల పూర్తి వివరాలను సేకరించాలని, ధాన్యం దిగుబడులపై వ్యవసాయ శాఖకు సంపూర్ణ అవగాహన ఉండాలని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమలు చేస్తున్న పైలెట్ ప్రాజెక్టును మరింత విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు.

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను వ్యవసాయ సేవల్లో ఉపయోగించాలని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించి, విత్తనాల సరఫరా నుంచి ధాన్యం కొనుగోలు వరకు వ్యవసాయ శాఖ, సివిల్ సప్లయిస్, అగ్రికల్చర్ యూనివర్సిటీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మార్క్‌ఫెడ్ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆయిల్‌ఫెడ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేయాలని, యాప్ ద్వారా బుక్ చేసుకున్న యూరియాను రైతు వేదికల ద్వారా పంపిణీ చేయాలని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్లకు యూరియా పంపిణీ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదేవిధంగా ఎరువుల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం లేఖలు రాయాలని, రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువులను తెలంగాణకే కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని కూడా సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు