•దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని నిర్ణయం
•వాహన వినియోగంపై విస్తృత చర్చ
•సగానికి తగ్గిన సీఎం కాన్వాయ్ వెహికల్స్
•ఇతర మంత్రులది అదే తీరు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బంగారం కొనుగోలు తగ్గించాలని కూడా సూచించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ముందుగా వారానికి రెండు రోజులు అమలు చేసేందుకు డిసైడ్ అయ్యారు. అదే సమయంలో దుబారా ఖర్చులు తగ్గించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రులకు జిల్లాల పర్యటనకు సంబంధించిన ఖర్చును కూడా గణనీయంగా తగ్గించాలని నిర్ణయించారు.
క్యాబినెట్లో విస్తృత చర్చ..
ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా పొదుపు పై కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో క్యాబినెట్ దీనిపైనే చర్చ జరిపింది. సుదీర్ఘంగా చర్చించింది. కొన్నాళ్లపాటు మంత్రులు విదేశీ పర్యటనలు రద్దు చేయాలని ప్రతిపాదనపై కూడా చర్చ నడిచింది. వారానికి ఒకరోజు నో వెహికల్ డే అమలు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. వెహికల్ కాకుండా ప్రత్యామ్నాయ రవాణా పై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో కానీ.. ఎలక్ట్రానిక్ వెహికల్ లో కానీ.. సైకిల్ను కానీ వినియోగించాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలోనూ మంత్రులు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. ఇకనుంచి సభలతో పాటు సమావేశాలు వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
-ప్రధానంగా కొన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలుకు నిర్ణయించారు. వాటికి సంబంధించిన మార్గదర్శకాలపై కసరత్తు జరుపుతున్నట్లు సీఎం వెల్లడించారు.
-ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల టెంపరేచర్ను 24 నుంచి 27 మధ్య ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని భావించారు. సోలార్ ఎనర్జీని ఎక్కువగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
-మరోవైపు మంత్రుల కాన్వాయ్ కు సంబంధించిన వాహన శ్రేణిని తగ్గించుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్య విషయంలో తగ్గించుకోవాలని సూచనలు చేశారు. ఒక్కో ఐఏఎస్ అధికారి ఎన్ని కార్లు వినియోగిస్తున్నారో కూడా లెక్కలు చెప్పాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వివిధ విభాగాలకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని ఒక్క వాహనం వినియోగించాలనిఆదేశించారు సీఎం చంద్రబాబు.
-మరోవైపు క్యాబినెట్ భేటీకి సైతం సీఎం చంద్రబాబు కేవలం నాలుగు వాహనాలతోనే సచివాలయానికి వచ్చారు. గతంలో పదికి పైగా వాహనాల్లో వచ్చేవారు. ఇప్పుడు నాలుగు వాహనాలతో వచ్చారు. భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక బస్సు ఏర్పాటు చేశారు.
-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన కాన్వాయ్ ను నాలుగు వాహనాలకు పరిమితం చేసుకోవాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
-మంత్రి నాదెండ్ల మనోహర్ మూడు వాహనాల కాన్వాయ్ తో సచివాలయానికి వచ్చారు. కొందరు మంత్రులు అయితే ఒక్కో వాహనంలో మాత్రమే వచ్చారు.
-మంత్రి నారా లోకేష్ తన కాన్వాయ్ ను సగానికి పైగా కుదించుకున్నారు. కేవలం రెండు వాహనాలకే పరిమితం చేశారు. భద్రత ప్రోటోకాల్ ప్రకారం ఇతర సిబ్బంది కోసం ఒక బస్సు ఏర్పాటు చేశారు.
-చాలామంది మంత్రులు ఎస్కార్ట్ వాహనాలు లేకుండా రావడం విశేషం. పొదుపు మంత్రం క్యాబినెట్ భేటీలో స్పష్టంగా కనిపించింది.