మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రాగన్ దేశంగా పేరుగాంచిన చైనా కూడా స్పష్టమైన ప్రకటనలు చేయడం విశేషంగా మారింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడాలని, యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని చైనా పిలుపునిచ్చింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ తక్షణం దాడులను ఆపాలని సూచించింది.
ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా దాడులు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు పలువురు ప్రభుత్వ ప్రముఖులు, కుటుంబ సభ్యులు మరణించినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇజ్రాయెల్తో పాటు అమెరికా మిత్రదేశాలపై క్షిపణి దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పరస్పర దాడులతో ప్రాంతీయ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
తొలుత ఖమేనీ హత్యను చైనా ఖండించినప్పటికీ, తాజాగా ఇరాన్కు బహిరంగ మద్దతు ప్రకటించడం అంతర్జాతీయ వేదికపై చర్చనీయాంశమైంది. ఇరాన్ భౌగోళిక సమగ్రతను కాపాడతామని చైనా పేర్కొనడంతో, భవిష్యత్తులో మరింత ప్రత్యక్ష పాత్ర పోషించే అవకాశాలపై విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియా ప్రాంతం అశాంతితో అట్టుడికిపోతుండగా, చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. ముఖ్యంగా చమురు ధరలు, వాణిజ్య మార్గాలు, భద్రతా సమీకరణాలు ప్రభావితమయ్యే పరిస్థితి తలెత్తవచ్చు. మధ్యప్రాచ్య సంక్షోభం అంతర్జాతీయ స్థాయికి విస్తరించే ప్రమాదం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: వింత జీవి జననం.. కళ్లు, ముక్కు లేకుండా కేవలం నోరు, చెవులతో జన్మించిన మేకపిల్ల
