-
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
-
వచ్చే నెలలో రాజ్యసభకు ఎంపిక
-
కొత్త సీఎంగా డీకే శివకుమార్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : కర్ణాటకలో శరవేగంగా రాజకీయాలు మారుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం తన క్యాబినెట్ మంత్రులకు తేనేటి విందు ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. అయితే ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు పాదాభివందనం చేశారు. తనను ఆశీర్వదించాలని కోరారు. ఆత్మీయంగా ఇద్దరు నేతలు ఆలింగనం చేసుకున్నారు. దీంతో కర్ణాటక తదుపరి సీఎం డీకే శివకుమార్ అని తేలిపోయింది.
మూడేళ్ల కిందట ముఖ్యమంత్రిగా..
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. డీకే శివకుమార్ తనకు పదవి కావాలని గట్టిగానే కోరారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్య వైపు మొగ్గుచూపింది. అయితే అప్పట్లోనే 2.5 ఫార్ములా తో చెరి సగం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముఖ్యమంత్రులుగా ఉంటారని నిర్ణయించినట్లు ప్రచారం సాగింది.
కానీ అనుకున్న దానికంటే ఆరు నెలల కాలం అధికంగా సీఎంగా ఉన్నారు సిద్ధరామయ్య. అయితే సీఎం పదవి షేరింగ్ ఉండాల్సిందేనని డీకే శివకుమార్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలు పట్టుబడుతూ వచ్చారు. తీవ్ర తర్జనభర్జన నడుమ కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాల మేరకు సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా ప్రకటించారు.
డీకే శివకుమార్ వైపు మొగ్గు..
కర్ణాటక కు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? అనే దానిపై విస్తృత చర్చ నడుస్తోంది. అయితే దాదాపు డీకే శివకుమార్ వైపు హై కమాండ్ మొగ్గుచూపుతున్నట్లు స్పష్టం అవుతుంది. నిన్నటి వరకు డీకే శివకుమార్ అభ్యర్థిత్వం విషయంలో సిద్ధరామయ్య వర్గం అభ్యంతరం చెప్పినట్లు ప్రచారం నడిచింది.
ఒకవేళ సిద్ధరామయ్య కాకుంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీఎంగా బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వినిపిస్తూ వచ్చింది. అయితే ఈరోజు డీకే శివకుమార్ సిద్ధరామయ్యకు పాదాభివందనం చేయడం ద్వారా.. తదుపరి ముఖ్యమంత్రి ఆయనే అన్నట్లు స్పష్టమవుతోంది. కాగా జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు సిద్ధరామయ్య. కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య శకం ఇక ముగిసినట్టే.