క్రైం మిర్రర్ : ఒకప్పుడు తమ ప్రభావంతో ఉమ్మడి అడవుల్లో సంచలనం సృష్టించిన మావోయిస్టు సంస్థ మరోసారి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఉద్యమం ఇంకా కొనసాగుతోందన్న సందేశంతో వెలువడిన కరపత్రాలు, బ్యానర్లు భద్రతా వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఖనిజ తవ్వకాలు, ఇనుప ఖనిజ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మావోయిస్టుల పేరుతో ప్రచారం సాగడంతో సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల పేరుతో ఉన్న కరపత్రాలు బయటపడినట్లు సమాచారం. ఈ పరిణామంతో గడ్చిరోలితో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా యంత్రాంగం నిఘాను పెంచింది. ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి పరిధిలోని కొన్ని గ్రామాల్లో లభించిన కరపత్రాల్లో ఇనుప ఖనిజ కంపెనీలు, కొత్త మైనింగ్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం కావాలని పిలుపునిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామస్థాయిలో వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇటీవల కాలంలో గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం తగ్గిందని అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, తాజాగా వెలుగుచూసిన కరపత్రాలు, బ్యానర్లు మరోసారి చర్చకు కారణమయ్యాయి. దీంతో అడవులు, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసి, అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం.
మరోవైపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
also read : ముద్రగడ హఠాన్మరణం కలచివేసింది: వైఎస్ జగన్