•గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స
•చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకుడు
•కాపు ఉద్యమనేతగా సుపరిచితం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం సాయంత్రం ఆయన మృతి చెందారు. గత కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రకటన కూడా చేశారు. ఇంతలోనే ఆయన మరణ వార్త బయటకు రావడం బాధాకరం.
1978లో ఎమ్మెల్యేగా..
ముద్రగడ పద్మనాభం సీనియర్ రాజకీయ నాయకుడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబుకు సమకాలీకుడు. వారిద్దరితోపాటు 1978లో తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన.. తండ్రి ముద్రగడ వీర రాఘవరావు వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో జనతా పార్టీ తరఫున ప్రత్తిపాడు నియోజకవర్గ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు పిలుపుమేరకు టిడిపిలో చేరారు. ఆయన క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రత్తిపాడు నుంచి వరుసగా గెలుస్తూ ఒక మాస్ లీడర్ గా ఎదిగారు.
ఉద్యమ నేతగా..
వాస్తవానికి ముద్రగడ రాజకీయ నేత కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ప్రజలకు సుపరిచితం. కాపు సామాజిక వర్గం ప్రయోజనాల కోసం చేసిన పోరాటాలు ఆయనను ఉద్యమ నేతగా మార్చాయి. 1990 కాలంలోనూ.. ఆ తరువాత 2018లో తుని వేదికగా ఆయన నడిపించిన కాపు రిజర్వేషన్ ఉద్యమం రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాపు సంక్షేమమే అజెండాగా ఆయన సాగించిన ఆమరణ నిరాహార దీక్షలు, పాదయాత్రలు కోస్తాంధ్రలో పెద్ద సంచలనం సృష్టించాయి. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముద్రగడ ఓడిపోయారు. దీంతో తీవ్ర రాజకీయ నిర్వేదానికి లోనై జన్మలో ప్రతిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు. 2009లో రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు పిఠాపురం నుంచి పోటీ చేశారు ముద్రగడ. మరోసారి ఆయనకు ఓటమి తప్పలేదు. చివరిగా 2014లో అదే పిఠాపురం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు ముద్రగడ.
శపథంతో పేరు మార్చుకొని..
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అలా ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల ఫలితాల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో.. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి తన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి.. ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే పవర్ఫుల్ రాజకీయాలనుంచి కుల రాజకీయాలకు మారి ముద్రగడ పద్మనాభం తన హవాను తగ్గించుకున్నారు అనే అపవాదును మూటగట్టుకున్నారు.