దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ గుర్తింపుపై కొనసాగుతున్న చర్చలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. పాస్పోర్ట్ అనేది కేవలం విదేశాలకు ప్రయాణించేందుకు ఉపయోగించే అధికారిక పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి ఆధార పత్రంగా పరిగణించరాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని మంత్రిత్వశాఖ మరోసారి రుజువు చేసింది. గతంలోనూ పలుమార్లు ఇదే విషయాన్ని తెలిపినప్పటికీ, ప్రజల్లో ఇంకా అపోహలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా వివరణ ఇచ్చింది. పాస్పోర్ట్ అనేది వ్యక్తి గుర్తింపు, ప్రయాణ అనుమతి కోసం ఉపయోగపడే పత్రం మాత్రమే. ఇది భారత పౌరసత్వాన్ని నిర్ధారించే లీగల్ డాక్యుమెంట్ కాదని అధికారులు స్పష్టం చేశారు. పౌరసత్వానికి సంబంధించి ఇతర అధికారిక ధృవపత్రాలే ప్రమాణంగా పరిగణించబడతాయని పేర్కొన్నారు.
ఇదే సమయంలో, 2025 సంవత్సరంలో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో పాస్పోర్ట్ సేవలు అందించబడినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం 1.5 కోట్లకు పైగా సేవలు అందించగా, అందులో 1.39 కోట్లకు పైగా పాస్పోర్ట్లే జారీ చేసినట్లు వివరించింది. ఇది పాస్పోర్ట్ సేవలపై పెరుగుతున్న డిమాండ్ను సూచిస్తోంది.
ప్రభుత్వం అందిస్తున్న డిజిటల్ సేవలు, వేగవంతమైన ప్రక్రియల వల్ల పాస్పోర్ట్ పొందడం మరింత సులభమైందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, పాస్పోర్ట్ వినియోగంపై సరైన అవగాహన ఉండాలని, దాన్ని పౌరసత్వ ధృవీకరణ పత్రంగా భావించకూడదని మరోసారి ప్రజలకు సూచించారు.
also read: నీట్ పేపర్ లీక్ కలకలం: తప్పులు జరిగాయని కేంద్ర మంత్రి అంగీకారం– భవిష్యత్తులో కఠిన చర్యలు!