-
ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ వెనుక పక్కా సోషల్ ఇంజనీరింగ్
-
గ్రేటర్ ఎన్నికల్లో గట్టి ప్రభావం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం ప్రత్యర్థులకు సైతం అంతు పట్టడం లేదు. ఆయన సమయం చూసి సరికొత్తగా పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున మాజీ సీఎం నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి అందర్నీ ఆశ్చర్యంతో ముంచేత్తారు.. హైదరాబాద్ మైత్రివనం సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్. విధ్వంస రాజకీయాలు, పాత పగలను పక్కనపెట్టి.. అందర్నీ కలుపుకుపోయే సరికొత్త రాజకీయ శైలి తెలంగాణలో ఆవిష్కృతం చేశారు రేవంత్ రెడ్డి.
-
టిడిపి అభిమానుల కోసమే..
మరోసారి తెలంగాణలో అధికారమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. అందుకు తెలుగుదేశం పార్టీ క్యాడర్ సాయం తీసుకునేందుకు ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారన్నది బహిరంగ రహస్యం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి, ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఇప్పటికీ ఒక అభిమాన గణం ఉంది. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. కానీ ఆ వర్గమంతా దిశ నిర్దేశం చేసేవారు లేక సైలెంట్ గా ఉంది. వారికి తాను ఒక కాంగ్రెస్ సీఎం గా కాకుండా.. పాత తమ్ముడు గా.. వారి ఓన్ లీడర్ గా గుర్తించేందుకుగాను ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు అనేది విశ్లేషకుల మాట. గత అసెంబ్లీ ఎన్నికల తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సైతం టిడిపి క్యాడర్ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చింది. దానిని మరింత గట్టిగా చేసుకునేందుకు.. టిడిపి క్యాడర్ను తన సొంత ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రేవంత్ పక్క ప్లాన్ తో అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
-
సాహసమైన పని..
కాంగ్రెస్ పార్టీని సిద్ధాంత పరంగా తీవ్రంగా విభేదించారు నందమూరి తారకరామారావు. ఒక్కమాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని బద్ధ శత్రువుగా చూశారు. కానీ రేవంత్ మాత్రం అదే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి.. నాటి రాజకీయ పరిస్థితులు వేరు.. నేటి రాజకీయ సమీకరణలు వేరు అని అర్థమయ్యే రీతిలో చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అస్తిత్వం.. టిడిపి క్యాడర్ సహకారం గురించి ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఒకవైపు కాంగ్రెస్ బ్రాండ్ అయినా ఇందిరమ్మ రాజ్యం గురించి మాట్లాడుతూనే.. మరోవైపు తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకాయన ఎన్టీఆర్ గొప్పతనాన్ని కొనియాడుతున్నారు. ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి బ్యాలెన్స్ తప్పకుండా ఆడుతున్న పొలిటికల్ గేమ్ గా విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.
-
గ్రేటర్ కోసమేనా..
త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సెటిలర్స్ కీలక భూమిక పోషించనున్నారు. అందున హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి టిడిపి క్యాడర్ లో సానుకూలత నింపుకున్నారు రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ వెనుక కాంగ్రెస్ కేడర్ ఉంటుందో లేదో తెలియదు కానీ.. టిడిపి క్యాడర్ మాత్రం చెక్కుచెదరదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచేది టిడిపి క్యాడర్ మాత్రమే. మరోసారి గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి క్యాడర్ రేవంత్ కు అండగా నిలవడం ఖాయం. తద్వారా తెలంగాణలో ఒక రాజకీయ బలమైన శక్తిగా మారుతారు రేవంత్ రెడ్డి. ఈ సరికొత్త సోషల్ ఇంజనీరింగ్ విధానంతో ముందుకు వెళుతున్నారు రేవంత్. మరి ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.