-
గత కొద్ది రోజుల ఉత్కంఠకు తెర
-
ఆహ్వానిస్తున్న బిల్డర్లు, డెవలపర్లు
-
సామాన్యుల నుంచి సైతం హర్షాతిరేకాలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించుతూ.. తెలంగాణ రేరా ఇంచార్జ్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
గత వారమే అనారోగ్య కారణాలతో ఎం సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయింది. ఇప్పుడు అత్యంత సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించింది.
సుదీర్ఘ అనుభవం..
జయేష్ రంజన్ నియామకంపై రియల్ ఎస్టేట్ రంగం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఐటీతోపాటు పరిశ్రమల శాఖల్లో సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులపై కూడా సమగ్ర అవగాహన ఉంది.. అటువంటి వ్యక్తికి రేరా బాధ్యతలు అప్పగించడం శుభపరిణామం అని బిల్డర్లతోపాటు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల క్లియరెన్స్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు మార్కెట్కు కొత్త ఊపిరి పోస్తాయని అంచనా వేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ఖాళీ..
రేరా చైర్మన్ పోస్ట్ కాళీ తో రియల్ ఎస్టేట్ రంగం ఒక విధంగా ఆందోళనకు గురైంది. అయితే తాజా నియామకంతో ఇళ్ల కొనుగోలుదారులలో ఒకరకం భరోసా కనిపిస్తోంది. రేరా నిబంధనల కఠిన అమలు, కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారంలో ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి తనదైన ముద్ర వేయగలరని సామాన్యులు సైతం ఆశిస్తున్నారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యవస్థను మరింత జవాబుదారీతనంతో కూడిన అభివృద్ధి, ఆధారిత పర్యావరణంగా మార్చడంలో ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభం వైపు వెళ్లకుండా.. సరైన సమయంలో సమర్ధుడైన అధికారికి బాధ్యతలు అప్పగించడం పై అభినందనలు వెలువెత్తుతున్నాయి.