Political Tension in Bengal: పశ్చిమ బెంగాల్ తాజా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాను ఓడిపోలేదని, అందువల్ల రాజీనామా చేసే అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రియాక్ట్ అయ్యారు. ఆమె రాజీనామా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుందన్నారు. అవసరమైతే ప్రభుత్వం రద్దు చేసే అవకాశమూ ఉంటుందని సూచించారు.
ఎన్నికల ప్రక్రియపై మమతా అసహనం
అటు బెంగాల్ లో ఎన్నికల ప్రక్రియపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను బీజేపీతో కాదు, ఎన్నికల సంఘంతోనే పోరాడాల్సి వచ్చిందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో లోపాలున్నాయని, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా చేశారు. కొన్ని స్థానాల్లో ఫలితాలు సక్రమంగా రాలేదని, దాదాపు 100 స్థానాల్లో అన్యాయం జరిగిందని ఆమె ఆరోపించారు. ఈ కారణాల వల్ల ఈ ఫలితాలను ఓటమిగా స్వీకరించలేనని, అందుకే రాజీనామా చేయనని స్పష్టం చేశారు.
మే 7 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు
అటు బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలపై కూడా చర్చ మొదలైంది. అయితే, ఎన్నికల సంఘం ఈ వార్తలను ఖండించింది. అసెంబ్లీ గడువు ముగిసేలోపు గెలిచిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ ఆహ్వానించడం సాధారణ ప్రక్రియ అని వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7తో ముగియనుండగా, ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
మే 9న ప్రమాణ స్వీకారం!
మరోవైపు బెంగాల్ లో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నది. మే 9న ప్రమాణస్వీకారం జరగవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూస్తే, ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్ లో రాజకీయ వేడి ఇంకా తగ్గని పరిస్థితి కనిపిస్తోంది.