క్రైమ్ మిర్రర్ : భర్తను హత్య చేసి, గ్యాస్ సిలిండర్ ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కుంటాల మండలం లింబా(బి) గ్రామంలో చోటుచేసుకుంది. ఏఎస్పీ పత్తిపాక సాయికిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. లింబా(బి) గ్రామానికి చెందిన బాలాజీ (35) మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 3న మద్యం మత్తులో తన తాత పీరాజీతో అకారణంగా గొడవకు దిగాడు. దీంతో బంధువులు వారిని విడదీసి బాలాజీని అక్కడి నుంచి ఇంటికి పంపించారు.
అనంతరం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన బాలాజీతో అతని భార్య పిరబాయి గొడవ పడింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన ఆమె భర్త చొక్కాతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. హత్య అనంతరం బాలాజీ మద్యం మత్తులో గ్యాస్ సిలిండర్ తనపై పడటంతో మృతి చెందినట్లు భార్య నమ్మించే ప్రయత్నం చేసిందన్నారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను తొలగించి, సహజ మరణంగా చిత్రీకరించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అయితే బాలాజీ మృతిపై బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో భార్య పిరబాయి ప్రమేయం బయటపడటంతో బుధవారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వెంట బైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, కుంటాల ఎస్సై నరేష్ ఉన్నారు.
also read :దుబాయ్లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. భారతీయ యువకుడు మృతి
