హైబీపీ అనేది వయసు పెరిగిన వారికే వస్తుందని భావిస్తుంటారు. అయితే ఇది పూర్తిగా అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైబీపీ ఏ వయసులోనైనా రావచ్చని, యువత కూడా దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న అబ్బాయిల్లో సుమారు 22 శాతం మంది, అమ్మాయిల్లో 19.4 శాతం మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు సర్వే వెల్లడించింది. ఈ గణాంకాలు యువతలో కూడా హైబీపీ వేగంగా పెరుగుతోందని తెలియజేస్తున్నాయి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారితో పోలిస్తే పట్టణాల్లో ఉండేవారిలో హైబీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అధిక ఉప్పు వినియోగం వంటి కారణాలు ఇందుకు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. హైబీపీ ప్రారంభ దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బీపీ ఎక్కువ రోజులు నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అందువల్ల 15 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు రక్తపోటు పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబంలో ఇప్పటికే హైబీపీ చరిత్ర ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, ఉప్పు పరిమితంగా వాడటం, ధూమపానం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా హైబీపీ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. చిన్న వయసులోనే బీపీని పరీక్షించుకోవడం, అవసరమైతే వెంటనే చికిత్స ప్రారంభించడం వల్ల భవిష్యత్తులో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది.