సైబరాబాద్లో హనీట్రాప్ పేరిట మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.9.29 లక్షలకు పైగా వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నార్సింగిలోని రాజపుష్ప ప్రొవిన్షియాలో నివసించే 23 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజనీర్కు ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున గుర్తు తెలియని మహిళ నుంచి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే ఆమె అసభ్యంగా ప్రవర్తిస్తూ, బాధితుడిని కూడా అలాగే చేయాలని ప్రేరేపించింది. కొద్దిసేపటి తర్వాత అదే నంబర్ నుంచి మరో కాల్ వచ్చింది. ఈసారి ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ, బాధితుడి వీడియోను ఎడిట్ చేసి చూపించాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపిస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. అంతేకాకుండా బాధితుడి సోదరి ఇన్స్టాగ్రామ్ ఖాతాకు వీడియో పంపినట్లు ఒక స్క్రీన్షాట్ కూడా పంపాడు.
ఈ బెదిరింపులకు భయపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మొదట రూ.82 వేలు పంపించాడు. ఆ తర్వాత రూ.1.40 లక్షలు, మరోసారి రూ.2.60 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ నిందితులు బెదిరింపులు ఆపకుండా మరింత డబ్బు కోరడంతో, విడతల వారీగా మొత్తంగా రూ.9,29,857 పంపించాడు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు ధైర్యం చేసి జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఒక నిందితుడికి చెందిన బ్యాంకు ఖాతాను అధికారులు బ్లాక్ చేసినట్లు తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ కు స్పందించవద్దని, ఇలాంటి బెదిరింపులు ఎదురైతే వెంటనే డబ్బు పంపకుండా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.