రంగారెడ్డి జిల్లాలో విషాదాంతానికి దారితీసిన కుటుంబ కలహాల ఘటన కలకలం రేపుతోంది. హయత్నగర్ పరిధిలోని కొహెడలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య తనను వదిలి మరో వ్యక్తితో రెండో పెళ్లికి సిద్ధమవ్వడమే కాకుండా, ఆ పెళ్లి ఏర్పాట్లు కూడా తానే చేయాలని ఒత్తిడి తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలను తట్టుకోలేకపోయిన గోవర్ధన్ ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేయడంతో పాటు సూసైడ్ నోట్ కూడా రాయడం ప్రస్తుతం ఈ ఘటనను మరింత సంచలనంగా మార్చింది. గోవర్ధన్ రాసిన లేఖ, వీడియో వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గోవర్ధన్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. చిన్న కాగితంపై తన మరణానికి కారణమైన పరిస్థితులను అతడు వివరించినట్లు తెలుస్తోంది. “నా చావుకు కారణమైన వాళ్ల గురించి నా ఫోన్లో వీడియో రికార్డు చేశాను. అది నా ఫోన్ గ్యాలరీలో ఉంది” అని గోవర్ధన్ ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా పోలీసులు వీడియోను సులభంగా పరిశీలించేందుకు తన మొబైల్ ఫోన్ ప్యాట్రన్ లాక్ను కూడా ఆ లేఖలో గీసి ఉంచడం గమనార్హంగా మారింది. దీంతో పోలీసులు ఆ వీడియో ఆధారంగా కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. భార్య తనతో వ్యవహరించిన తీరు, ఎదురైన అవమానాలను గోవర్ధన్ వీడియోలో వివరించినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొహెడకు చెందిన గోవర్ధన్, సరిత అనే యువతిని 4 ఏళ్ల క్రితం ప్రేమించి ఇంట్లో వారికి తెలియకుండా వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక మగబిడ్డ కూడా జన్మించాడు. అయితే ఇటీవల సరిత తమ బిడ్డను అమ్మేసిందని, అనంతరం మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో గోవర్ధన్ పలుమార్లు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ తనతో రావడానికి నిరాకరించిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్య ప్రవర్తనతో తీవ్రంగా కలత చెందిన గోవర్ధన్ చివరకు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత గోవర్ధన్ ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా గోవర్ధన్ ఉరివేసుకుని కనిపించాడు. ఆత్మహత్యకు ముందు తన మరణానికి కారణమైన వ్యక్తులను వదిలిపెట్టొద్దని వీడియోలో కోరినట్లు సమాచారం. గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా అమ్మేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నారి ఆచూకీ ఇంకా లభించలేదని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
ALSO READ: 5 రోజుల్లో నలుగురికి జన్మనిచ్చిన మహిళ