క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కల్వకుంట్ల కవిత స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్ఎస్) పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కవిత కొత్త పార్టీ పేరును మార్చాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రక్షణ సేన పేరుపై ప్రజల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మూడు పేర్లు ఇవ్వకపోతే దరఖాస్తును మూసివేస్తామని హెచ్చరించింది.
టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు వీల్లేదంటూ కవితకు ఈసీ లేఖ రాసింది. పేరు వివాదంతో కవిత కొత్త పార్టీ రిజిస్ట్రేషన్కు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో కొత్త పేర్లతో దరఖాస్తును సవరించాలని ఈసీ సూచించింది. ఈసీ లేఖపై కవిత స్పందించారు. తమకు అధికారికంగా ఈసీ నుంచి వచ్చిన రెండు అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే కొత్త పేర్లు ఇచ్చేది లేదని.. న్యాయపోరాటానికే సిద్ధమని కవిత స్పష్టం చేశారు.