-
జాతీయ కార్యవర్గాల్లో నేతలకు దక్కని చోటు
-
ఉన్న వారిని సైతం తొలగింపు
-
పార్టీలో అంతర్గత విభేదాలు కారణం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: భారతీయ జనతా పార్టీ కార్యవర్గాల్లో తెలంగాణకు మొండి చేయి చూపడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. నూతన జాతీయ ఆఫీస్ బేరర్ల జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి కనీస ప్రాతినిధ్యం లేకపోయింది.
దీనిపై విస్తృత చర్చ సాగుతోంది. గత కమిటీలో జాతీయ ఉపాధ్యక్షురాలు గా ఉన్న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణను తప్పించారు. ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మోర్చాల అధ్యక్షుల విభాగాల్లో రాష్ట్రం నుంచి ఏ ఒక్క నేతకు స్థానం దక్కకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీకి ఎక్కువ అవకాశాలు కల్పించారు.
జాతీయ ఉపాధ్యక్షుడు పదవి ఇద్దరికి లభించింది. మరొకరికి పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా కూడా అవకాశం ఇచ్చారు. కానీ తెలంగాణను పూర్తిగా పక్కన పెట్టడం పై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది.
-
ఏపీతో పోల్చుకుంటే..
ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో బిజెపి బలంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది.. అటువంటి తెలంగాణపై బిజెపి కేంద్ర నాయకత్వం అసంతృప్తిగా ఉంది. స్థానిక నేతల మధ్య వర్గ పోరుతో కేంద్ర నాయకత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా, ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లాల్సిన బిజెపి.. నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా వెనుకబడుతోంది. అంతర్గత కుమ్ములాటలు, ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకునే ధోరణితో క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ దిగజారుతోంది.
దీనిపై హై కమాండ్ వద్ద పక్కా సమాచారం ఉంది. ఎన్నికల విజయాల తర్వాత మరింత ఐక్యంగా పని చేయాల్సింది పోయి.. గ్రూపులుగా విడిపోయి పార్టీని బజారున పడేస్తున్న వారిపై హై కమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
-
హై కమాండ్ వద్ద సమాచారం
పశ్చిమ బెంగాల్ తర్వాత తమ లక్ష్యం తెలంగాణ అని ప్రకటించారు బిజెపి పెద్దలు. కానీ ఇప్పుడు జాతీయ కార్యవర్గంలోనే తెలంగాణకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదు. ఇక్కడి నేతల తీరుతో హై కమాండ్ విసిగి వేసారి పోయిందని.. అందుకే పదవుల విషయంలో మొండి చేయి చూపిందన్న టాక్ వినిపిస్తోంది.
పదవులు ఇచ్చినా విభేదాలతో మరింత రెచ్చిపోతారని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ నేతలకు ఇది ఒక షాక్ ట్రీట్మెంట్ అని చెప్పవచ్చు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టకపోతే భవిష్యత్తులో ప్రాధాన్యం ఉండదని తేల్చి చెప్పినట్లు అయింది. ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్రమంత్రి వర్గంలో కూడా తెలంగాణకు చోటు దక్కడం కష్టమేనన్న టాక్ నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
