క్రైమ్ మిర్రర్ : అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. ఓ అమెరికా సైనికుడిని పట్టుకున్నా లేదా చంపినా నగదు బహుమతి అందిస్తామని ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతామీ ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ ప్రకటన టెహ్రాన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చేసినట్లు సమాచారం. అమెరికా సైనికుడికి సంబంధించిన చర్యల్లో మహిళలు పాల్గొంటే వారికి మరింత ఎక్కువ మొత్తాన్ని బహుమతిగా అందించేలా పథకాన్ని రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని అమీర్ హతామీ ‘ఆర్థిక జీహాద్’గా అభివర్ణించారు. దేశ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలనే ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
ఇదే సమయంలో పశ్చిమాసియా ప్రాంతం నుంచి అమెరికా వైదొలగాలని ఇరాన్ మరోసారి డిమాండ్ చేసింది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, హొర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇకపై అనుమతి ఉండదని ఇరాన్ సైన్యాధిపతి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ అమెరికా సైనిక ఆధిపత్యంపై ప్రభావం చూపుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా పలు దేశాలు కొత్త భద్రతా వ్యవస్థలు, వ్యూహాలను అన్వేషించే పరిస్థితి ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ తాజా ప్రకటనతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులు మరింత చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా హొర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన రవాణాలో కీలక మార్గం కావడంతో, ఈ ప్రాంతంలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
also read : నాలుగు నెలల్లో 22 మరణశిక్షలు.. ముజఫర్నగర్ జడ్జి సంచలన తీర్పులు
