-
ఏరి కోరి కష్టాలను తెచ్చుకుంటున్న కాంగ్రెస్ సర్కార్
-
వేల ఎకరాల ప్రైవేటు భూములు ఆ జాబితాలోకి..
-
అధికారుల తప్పిదాలకు ప్రజలు మూల్యం
-
మేల్కొనుకుంటే వ్యతిరేకత ఖాయం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో లక్షలాదిమంది చిక్కుల్లో పడ్డారు. రిజిస్ట్రేషన్ల చట్టం 1908 లోని సెక్షన్ 22 ఏ పేరుతో జరుగుతున్న వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రభుత్వ, దేవాదాయ,వక్ఫ్, అసైన్డ్, సీలింగ్ నిగుల భూముల పరిరక్షణ పేరుతో చేపట్టిన రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేసే ప్రక్రియలో తప్పిదాలు జరిగాయి.
క్షేత్రస్థాయి అధికారుల బాధ్యతారాహిత్యంతో లక్షలాదిమంది సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రైవేటు ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. జీవితకాల కష్టార్జితంతో చట్టబద్ధమైన అనుమతులతో కొనుగోలు చేసుకున్న సొంత ఇళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లపై రాత్రికి రాత్రే నిషేధిత ముద్ర పడటంతో సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
-
హైదరాబాద్ లోనే అధికం..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోనే 22 ఏ రిమార్క్స్ అధికంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 22a జాబితాలో చేరిన ఆస్తుల్లో… దాదాపు 54 శాతానికి పైగా మేడ్చల్- మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ కోర్సిటీ జిల్లాల్లోనే ఉన్నాయి.. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, ఉప్పల్ వంటి అత్యంత కీలకమైన నివాస ప్రాంతాల్లోని లక్షకు పైగా ప్రాపర్టీలు..
ఈ జాబితాలో చిక్కుకుపోయాయి. వీటి మార్కెట్ విలువ లక్ష కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. ఈ ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బ్యాంకుల రుణాలు, మార్ట్ గేజ్ లు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ తో పాటు బ్యాంకింగ్ రంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
-
అవసరాలు దాటక..
తప్పు అధికార యంత్రాంగానిదైతే ఇప్పుడు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. అత్యవసర వైద్య ఖర్చులు, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం తమ ఆస్తులను అమ్ముకుందామనుకుంటే వేలాదిమంది ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద లబోదిబోమంటున్నారు.
అధికారుల తప్పిదం వల్ల ప్రైవేట్ ఆస్తులు ఈ జాబితాలోకి ఎక్కగా.. ఇప్పుడు మళ్లీ ప్రజలే తమ ఆస్తులను 22ఏ నుంచి తొలగించాలంటూ కలెక్టరేట్లు, రిజిస్టార్ కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సి వస్తోంది. అయితే ఈ పరిస్థితిని గుర్తించిన రెవెన్యూ మంత్రి అధికారుల తప్పిదాలకు క్షమాపణలు చెప్పారు.
హై లెవెల్ కమిటీ, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే కేవలం క్షమాపణలతో సరిపెట్టడం కాదు. మొక్కుబడి కమిటీలతో ఈ సమస్య పరిష్కారం కాదు. గతంలో హైకోర్టు ఆదేశాల ద్వారా నిషేధిత జాబితా నుంచి క్లియర్ అయిన భూములను కూడా.. రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేయకపోవడం అధికారుల క్షమించరాని నేరం.
ప్రజలు దరఖాస్తు చేసుకునే వరకు వేచి చూడకుండా.. ప్రభుత్వమే యుద్ద ప్రాతిపదికన ఈ డిజిటల్ డేటాను ప్రక్షాళన చేసి.. అన్ని ప్రైవేట్ రిజిస్టర్ లే అవుట్లను వెంటనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటితో ప్రజా వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకునే అవకాశం ఉంది. ఇక తేల్చుకోవాల్సింది ఆ పార్టీ మాత్రమే.
