దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. భూకంపాల ధాటికి దేశ రాజధాని కారకాస్తో పాటు పలు ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూలిపోయాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రాణనష్టం భారీగా ఉండే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికాకు చెందిన యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపాల తర్వాత మరిన్ని బలమైన ప్రకంపనలు సంభవించే అవకాశం ఉంది. ఈ విపత్తు కారణంగా భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు మృతుల సంఖ్యపై వెనెజువెలా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, చనిపోయిన వారి సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. భూకంపాల కారణంగా గాయపడిన వారి సంఖ్య పెరుగుతోందని స్థానిక అధికారులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
ప్రజలు ఇళ్లలో ఉండకుండా బయటకు రావాలని ప్రభుత్వం సూచించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో గ్యాస్, పెట్రోల్ సరఫరాలను కూడా నిలిపివేసింది. మరిన్ని భవనాలు కూలిపోయే ప్రమాదం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా, జూన్ 24న వెనెజువెలాలో జాతీయ సెలవుదినం కావడంతో ఎక్కువ మంది తమ ఇళ్లలోనే ఉన్నారు. సాయంత్రం సమయంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. సెలవుదినం కారణంగా ప్రాణనష్టం మరింత పెరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
రెండు భారీ భూకంపాల తర్వాత దాదాపు 20 వరకు ఇంటర్నల్ ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భూకంపం కారణంగా కొన్ని కీలక మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. కొన్ని విమాన సర్వీసులను నిలిపివేయగా, పాఠశాలలను కూడా తాత్కాలికంగా మూసివేశారు.